Business

కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులకు టీచర్స్‌ డే సందర్భంగా శుభవార్త

కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులకు టీచర్స్‌ డే సందర్భంగా శుభవార్త

గురుపూజోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేసిన ప్రభుత్వం.. తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను క్రమబద్దీకరించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

2007లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మొత్తంగా 567 మంది ఉపాధ్యాయులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించింది. అందులో స్టాఫ్‌ నర్సులతోపాటు, లైబ్రేరియన్లు కూడా ఉన్నారు. అయితే రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేయించిన నాటి ఉమ్మడి ప్రభుత్వం వేతనాలను మాత్రం ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించి.. గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోపాటు పీఆర్సీని అమలు చేయడంతోపాటు, 12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లిస్తున్నది.కాగా, గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం జారీ చేసింది.

కాంట్రాక్టు పద్ధతిలో ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 567 మంది ఉపాధ్యాయుల్లో వారిలో 504 మంది మహిళలే కావడం విశేషం. ఇక ప్రభుత్వం నిర్ణయంపై కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.