Politics

‘స్వేదపత్రం’ పేరిట కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

‘స్వేదపత్రం’ పేరిట కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా భారాస పాలనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక, అబద్ధాల పుట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. అదొక అంకెల గారడీ, అభాండాల చిట్టా అని విమర్శించారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీ వేదికగా దీటుగా సమాధానం చెప్పామన్నారు. గత తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ తెలంగాణభవన్‌లో ‘స్వేదపత్రం’ పేరిట కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చివరకి వాయిదా వేసుకొని పోయారు. బాధ్యతగల పార్టీగా ‘స్వేద పత్రం’ విడుదల చేస్తున్నాం. కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ఈ స్వేదపత్రం. కొత్తరాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం నుంచి సమృద్ధివైపు తెలంగాణ అడుగులు వేసింది. రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొంది. ఎన్నో పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైంది. ఇప్పుడు కొందరు నేతలు తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారు. ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు. పేలిన బుల్లెట్లకు లెక్కలేదు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది’’ అని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని కేటీఆర్‌ తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షల కోట్లు కాగా.. దీన్ని కాంగ్రెస్‌ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z