Health

5 AIIMSలను ప్రారంభించిన మోడీ-NewsRoundup-Feb252024

5 AIIMSలను ప్రారంభించిన మోడీ-NewsRoundup-Feb252024

* తెలుగుదేశం (TDP) ప్రకటించిన తొలి జాబితాలో చోటు దక్కని ఆలపాటి, బొడ్డు వెంకటరమణ, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, పీలా గోవింద్‌తో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) విడివిడిగా మాట్లాడారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు సర్దుబాటును అర్థం చేసుకోవాలని మాజీమంత్రి ఆలపాటి రాజాకు సూచించారు. రాజకీయ భవిష్యత్‌కు తగిన ప్రత్యామ్నాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పర్యటక కేంద్రంగా విరాజిల్లుతున్న విశాఖ నగరంలో మరో సరికొత్త ఆకర్షణ చేరింది. సాగర తీరంలో అలలపై తేలియాడేలా ఏర్పాటు చేసిన ‘ఫ్లోటింగ్ బ్రిడ్జి’ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో నగరంలో పర్యటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఏర్పడింది.

* విచారణకు సోమవారం హాజరు కాలేనని భారాస ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. 41ఏ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు. ‘‘సీబీఐకి సమాచారం కావాలంటే వర్చువల్‌ పద్ధతిలో హాజరవుతా. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరుకాలేను. 41ఏ నోటీసులు ఇవ్వడం సబబు కాదు’’ అని లేఖలో పేర్కొన్నారు.

* తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కె.శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

* అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్‌ బార్లపల్లె వద్ద అతివేగంతో కారు.. నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉండే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలు కాగా.. మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లెకు చెందిన కారు కర్ణాటకకు వెళ్లి ఆదివారం తిరిగి వస్తుంది. ఈ క్రమంలో అతివేగంతో వచ్చిన కారు.. పోళ్లవారిపల్లెకు చెందిన పాల రైతులు చంద్ర (50), సుబ్రహ్మణ్యం (62) నడుచుకుంటూ వెళ్తుండగా వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. కారు కంట్రోల్‌ తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉండే తిలక్‌, విక్రమ్‌, శ్రీను అక్కడికక్కడే చనిపోయారు. డీఎస్పీ ప్రసాద్‌ రెడ్డి, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మృతి చెందిన వారికి న్యాయం చేయాలని స్థానికులు బార్లపల్లెలో పెద్దఎత్తున నిరసనకు దిగారు. కారు డ్రైవర్‌ మద్యం తాగి డ్రైవింగ్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

* దేశంలోని మెజారిటీ ప్రజలు నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) ఆదివారం అన్నారు. మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రతి ఒక్కరూ ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. బారామతి(Baramati)లోని రైతుల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

* దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళగిరితో పాటు రాజ్‌కోట్‌ (గుజరాత్‌), బఠిండా (పంజాబ్‌), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్‌), కల్యాణి (పశ్చిమబెంగాల్‌) నగరాల్లో ఎయిమ్స్‌ ఆస్పత్రులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.

* భారత్‌ (India), జపాన్‌ (Japan) మధ్య రక్షణ సహకారం మరింతగా బలోపేతం దిశగా కీలక ముందడుగు పడింది. ‘ధర్మ గార్డియన్‌’ పేరిట ఇరుదేశాల సైనిక బృందాల సంయుక్త విన్యాసాలు ( joint Air Exercise) ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25న మొదలైన ఈ విన్యాసాలు రాజస్థాన్‌లోని మహజన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో మార్చి 9 వరకు కొనసాగనున్నాయి.

* వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపాను ఎదుర్కొనేందుకు కలిసి పోటీ చేసే విషయమై విపక్ష పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒప్పందం కుదిరింది.

* యువ‌ మోర్చా నేతపై సీఐ దాడి చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎయిమ్స్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా యువ మోర్చా ఫ్లెక్సీ పెట్టడంలో తప్పు లేదన్నారు. ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, అందులో భాగంగానే ఎయిమ్స్ నిర్మాణానికి ప్రతి రూపాయీ కేంద్రమే ఇచ్చిందని వివరించారు. ఇది తప్పని నిరూపిస్తే రూ.లక్ష బహుమానం ఇస్తామని యువమోర్చా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎయిమ్స్ నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, వైకాపా సర్కారు సక్రమంగా నీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పక్కనే డంపింగ్‌ యార్డు పెట్టడంతో దుర్గంధం వస్తోందన్నారు.

* తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆలపాటి రాజా ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో తెనాలి తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజాను తన నివాసానికి పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడారు. ఈ భేటీలో ఆయన రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

* చంద్రబాబు మాటే తనకు శిరోధార్యమని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అంటూ విధేయత చాటుకున్నారు. ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో పార్టీ అధినేతతో ఉమా సమావేశమయ్యారు. కొన్ని సమీకరణాల్లో భాగంగానే తొలి జాబితాలో పేరు ప్రకటించలేదని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

* తొలి జాబితాలో చోటు దక్కని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta srinivasarao) కూడా చంద్రబాబును కలిశారు. భేటీ ముగిసిన తర్వాత గంటా మీడియాతో మాట్లాడారు. ‘‘ చీపురుపల్లి నుంచి పోటీ చేయమని సూచించారు. భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పా. నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావని అన్నారు. ఎక్కడ పోటీ చేయాలనే విషయం తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు అన్నారు. తెదేపా తొలి జాబితా ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మొదటి జాబితాపై ప్రజాస్పందన బాగుందని చెప్పా. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో.. వైకాపా ఓడిపోవడం అంతే నిజం’’ అని వ్యాఖ్యానించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z