ScienceAndTech

చంద్రయాన్ విఫలం

Chandrayaan-2 Lunar Mission Faces Landing Troubles

అందినట్టే అందిన చందమామ చివరిక్షణాల్లో జారిపోయాడు. 48 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని, ఆటుపోట్లను ఎదుర్కొని చంద్రునిపైకి చేరిన చంద్రయాన్‌ -2 చివర్లో తడబాటుకు గురైంది.

చంద్రుని ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్‌ రోవర్‌ ఆ దిశలో ప్రయాణం ప్రారంభించిన కాసేపటికే ఆటంకాలను ఎదుర్కొంది.

తొలిదశలో సజావుగానే అందిన సంకేతాలు మలిదశ ప్రారంభమైన కాసేపటికే విక్రమ్‌ నుండి నిలిచిపోయాయి.

దీంతో బెంగళూరులోని ఇస్ట్రాక్‌లో నరాలు తెగే ఉత్కంఠ! కొన్ని నిమిషాల తరువాత ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ చివరి దశలో ల్యాండర్‌లో సమస్య తలెత్తిందని, చంద్రునికి 2.1 కి.మీల దూరం వరకు విక్రమ్‌ ప్రయాణం సజావుగా సాగిందని, ఆ తరువాత విక్రమ్‌ నుండి సంకేతాలు రావడం నిలిచిపోయిందని ప్రకటించారు.

సమాచారాన్ని విశ్లేషించాల్సిఉందని చెప్పారు. అంతవరకు ఉత్సాహంగా ప్రతి దశలోనూ కరతాళధ్వనులతో ఆనందాన్ని ప్రకటించిన శాస్త్రవేత్తలు ఈ ప్రకటనతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు.

ప్రయోగాన్ని వీక్షించడానికి వచ్చిన విద్యార్థుల్లోనూ ఇదే స్థితి కనిపించింది. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం ఒకవైపు చంద్రుని చుట్టూ విజయవంతంగా తిరుగుతున్నా విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది.

శాస్త్ర ప్రయోగాల్లో వైఫల్యాలు సహజమని,శాస్త్రవేత్తలు ధైర్యంగా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.

చంద్రయాన్‌ -2లో ఇప్పటికే సాధించిన విజయంతో ఎంతో తెలుసుకున్నామని చెప్పారు.

ప్రయాణంలో అత్యంత కీలకమైన దశ శనివారం తెల్లవారుజామున 1.43 గంటలకు ప్రారంభమైంది.

బెంగళూరులోని ఇస్రో కార్యాలయం నుండి శాస్త్రవేత్తలు పంపిన ఆదేశాలకు అనుగుణంగా అంతరిక్ష నౌకలోని విక్రమ్‌ ల్యాండర్‌ స్పందించడం ఆ క్షణం నుండే ప్రారంభమైంది.

చంద్రుని వైపు ప్రయాణాన్ని అత్యంత సున్నితంగా పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఇస్ట్రాక్‌ (ఐఎస్‌టిఆర్‌ఎసి) లోని శాస్త్రవేత్తల్లో తీవ్ర ఉత్కంఠ! సుదీర్ఘప్రయాణం అనంతరం ఇస్తున్న ఆదేశాలకు విక్రమ్‌ ఎలా స్పందిస్తుందో అన్న ఉద్వేగం.. అయితే, విక్రమ్‌ ఈ ఆదేశాలను అందుకుంది.

చంద్రునివైపుగా అడ్డంగా ప్రయాణం ప్రారంభించింది.7.4 కి.మీల తొలి దశ ప్రయణం సరిగ్గా 60 సెకన్లలో ముగిసింది.

1.53 గంటలకు తొలిదశ (రఫ్‌ బ్రేకింగ్‌) విజయవంతమైంది.

ఆ వెంటనే మరో 5 కిలో మీటర్ల ఫైన్‌ బ్రేకింగ్‌ దశ ప్రారంభమైంది. 53 సెకన్లలో ఈ దూరాన్ని విక్రమ్‌ అధిగమించాల్సిఉంది.

ఆ తరువాత అత్యంత కీలకమైన నిట్టనిలువుగా చంద్రునిపైకి దిగే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

అయితే, ఇక్కడే.. ఆ 53 సెకన్లలోనే జరగరానిది ఏదో జరిగింది. ఆ సమయంలో చంద్రునిపైకి 300 మీటర్ల దూరంలో విక్రమ్‌ ఉంది!

అప్పటి వరకు విక్రమ్‌ నుండి ఇస్ట్రాక్‌కు అందుతున్న సంకేతాలు నిలిచిపోయి.

అంతే.. అంతా ఉత్కంఠ! ఏం జరుగుతుందోనన్న ఆందోళన! శాస్త్రవేత్తలు, ఇంజినీర్లతో పాటు దేశ ప్రజలంతా ఊపిరిబిగబెట్టి ఏం జరుగుతుందోనని ఎదురుచూసిన క్షణాలవి.

సెకన్లు, నిమిషాలుగా గడిచిపోతున్నా విక్రమ్‌ నుండి సంకేతాలు ఇస్ట్రాక్‌కు అందలేదు.

చంద్రయాన్‌-2 చివర్లో అవాంతరాలు ఎదురుకావడంతో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ అర్ధంతరంగా వెనుతిరిగారు.

ఫైన్‌ బ్రేకింగ్‌ దశలో విక్రమ్‌ నుండి సంకేతాలు రావడం నిలిచిపోయిన తరువాత కొన్ని నిమిషాలు మాత్రమే ప్రధాని ఇస్ట్రాక్‌లో ఉన్నారు.

ఆ సమయంలో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌తో పాటు మరికొందరు శాస్త్రవేత్తలు ప్రధాని వద్దకు చేరుకుని ఏదో చెప్పడం కనిపించించింది.

ఆ వెంటనే ఆయన అక్కడినుండి వెనుతిరిగారు.