DailyDose

నేటి ప్రధాన వార్తలు–10/01

Telugu Top News Today - Oct 1st 2019

1.ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఉపాధి హామీ పనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం పేదల జీవనోపాధిని దెబ్బతీస్తోందని లేఖలో పేర్కొన్నారు. గత 4 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పనులు చేసేవారికి బిల్లులు ఇవ్వట్లేదని, కూలీలకు సకాలంలో వేతనాలు లేవని మండిపడ్డారు.
2. గాయత్రి దేవిగా దర్శనమిచ్చిన భద్రకాళి
వరంగల్‌ భద్రకాళి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇవాళ ఉదయం భద్రకాళి అమ్మవారికి సింహ వాహన సేవ నిర్వహించారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
3. స్వామిని తాకని సూర్యకిరణాలు
ఆకాశం మేఘావృతం కావడంతో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఇవాళ సూర్య కిరణాలు తాకలేదు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకి, శిరస్సు వరకు వెళ్తాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు నిరాశ చెందారు. స్వామివారి మూల విరాట్‌పై రేపు పడే అవకాశం ఉందని అర్చకులు తెలిపారు.
4. ఆడపిల్ల పుట్టిందని హతమార్చాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం రేగుంటలో దారుణం చోటు చేసుకుంది. రెండో సంతానంలోనూ పాప పుట్టిందని ఓ తండ్రి దుర్మార్గానికి ఒడిగట్టాడు. నెలరోజుల పసికందును నీటితొట్టిలో పడేసి చంపేశాడు. నిందితుడు సూర్యతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
5. ‘హౌడీ-మోదీ’లో ప్రధాని అలా అనలేదు
రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ మరోసారి విజయం సాధించాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ ‘అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌’ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ వివరణ ఇచ్చారు. ట్రంప్‌కి మద్దతు పలకడం మోదీ ఉద్దేశం కాదని.. అమెరికాతో భారత్‌ బంధం ఎప్పటికీ ఉభయతారకమేనని స్పష్టం చేశారు. ‘‘మోదీ ఉద్దేశం అది కాదు. సరిగ్గా గమనించండి. ట్రంప్‌ ఏదైతే గతంలో చెప్పారో ప్రధాని కేవలం దాన్ని గుర్తుచేశారు. ఏం చెప్పాలనున్నారో దానిపై ఆయనకు స్పష్టత ఉంది. అని జైశంకర్‌ వివరణ ఇచ్చారు.
6. ‘250 మంది మాత్రమే నిర్బంధంలో ఉన్నారు’
జమ్మూ-కశ్మీర్‌లో ప్రస్తుతం 200-250మంది మాత్రమే నిర్బంధంలో ఉన్నారని భాజపా ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ అన్నారు. అధికరణ 370 రద్దు చేసిన రోజు ముందస్తు చర్యల్లో భాగంగా దాదాపు 2000-2500 మందిని అదుపులోకి తీసుకున్నారన్నారు. పరిస్థితులు చక్కబడుతున్న కొద్దీ నిర్బంధంలో ఉన్నవారి సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నామని తెలిపారు.
7. భారతీయ విద్యార్థుల హక్కులను కాపాడండి
బ్రిటన్‌లో చదువుకోవాలనే విద్యార్థుల వీసాల విషయంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించాల్సిందిగా భారత ప్రభుత్వం యూకేని కోరింది. బ్రిటన్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల హక్కులను కాపాడాలని సూచించింది. వారికి వీసా సంబంధ సమస్యలను తీర్చాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్‌ కుమార్ భల్లా..యూకే హోం శాఖ కార్యాలయం డైరెక్టర్ జనరల్‌ గ్లిన్‌ విలియమ్స్‌కు విజ్ఞప్తి చేశారు.
8. అరగంటలో అమెరికాను చేరే డ్రాగన్‌ క్షిపణి..!
చైనా ఆయుధ బలాన్ని మరోసారి ప్రదర్శించింది. అత్యంత ఆధునిక ఆయుధాలను ఈ సారి ప్రదర్శనకు తెచ్చింది. వీటిల్లో అర గంటలో అమెరికాను చేరుకునే బాలిస్టిక్‌ క్షిపణనిని తొలిసారి ప్రదర్శించింది. చైనాకు చెందిన వాహనాలు ఈ క్షిపణులతో తియన్మాన్‌ స్క్వేర్‌ వద్ద బారులు తీరాయి.