Business

ధనార్జన ఆగలేదు

ధనార్జన ఆగలేదు

ప్రపంచవ్యాప్తంగా అందరూ గత మూడు నెలలుగా ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యే ఉంటారు. అందుకు అమెరికా కూడా మినహాయింపు కాదు. అయితే కొంత మంది అమెరికన్‌ బిలియనీర్లు మాత్రం మరింత సంపదను వెనకేసుకురావడమే విశేషం.అమెరికా కుబేరుల సంపద 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ కరోనా సమయం ప్రారంభం(మార్చి 18) నుంచి చూస్తే 19% పెరిగింది. దాదాపు 565 బిలియన్‌ డాలర్ల మేర ఎక్కువగా ఆర్జించారని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌’ నివేదిక చెబుతోంది. అయితే సామాన్య ప్రజల పరిస్థితి మరోలా ఉంది. 4.3 కోట్ల మంది అమెరికా పౌరులు మాత్రం నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది తక్కువదాయ సిబ్బంది.. ముఖ్యంగా ప్రయాణ, సేవా రంగ ఉద్యోగులపై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ సంక్షోభం కారణంగా అసమానతలు మరింత పెరగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
***ఎందుకు పెరిగిందంటే..
స్టాక్‌మార్కెట్లో రికవరీతో అమెరికా కుబేరుల సంపద పెరుగుతూ పోయింది. ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక రేట్లను సున్నా వద్ద ఉంచడం, బాండ్లను భారీగా కొనుగోలు చేస్తామన్న హామీని ఇవ్వడం మార్కెట్‌ రాణించడానికి దోహదం చేసింది. ముఖ్యంగా దిగ్గజ సాంకేతిక కంపెనీలు ఈ ర్యాలీలో లబ్ది పొందాయి. కరోనా సమయంలో మరింత రాణించాయి.
* అమెజాన్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. కరోనా తర్వాతే ఇది మరింత అత్యవసరంగా మారింది. మార్చి నాటి కనిష్ఠాల నుంచి అమెజాన్‌ షేరు 47 శాతం పెరిగింది. దీంతో అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ నికర విలువ మార్చి 18తో పోలిస్తే 36.2 బిలియన్‌ డాలర్లు అధికంగా పెరిగింది.
* ఫేస్‌బుక్‌ షేరు రికార్డు గరిష్ఠాలకు చేరింది. దీంతో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద మార్చి 18తో పోలిస్తే 30.1 బిలియన్‌ డాలర్లు హెచ్చింది.
* టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌, గూగుల్‌ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్‌, లారీ పేజ్‌; మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈఓ స్టీవ్‌ బామర్‌లు ఒక్కొక్కరు 13 బిలియన్‌ డాలర్లు అంత కంటే ఎక్కువ సంపదను పెంచుకోగలిగారు.
* 1990- 2020 మధ్య అమెరికా కుబేరుల సంపద 1130% మేర పెరిగింది.