Politics

ఈశాన్య రాష్ట్రాల్లో మూడింటి ఎన్నికల తేదీలు ఇవే

ఈశాన్య రాష్ట్రాల్లో మూడింటి ఎన్నికల తేదీలు ఇవే

నాగాలాండ్‌కు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు

మేఘాలయా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు

త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు

మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రకటన

న్యూఢిల్లీ, సూర్య ప్రత్యేక ప్రతినిధి : 2023లో తొలి భాగంలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయా, త్రిపురలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సీఈసీ రాజీవ్‌ కుమార్‌.పాత్రికేయ సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నాగాలాండ్‌కు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13,09, 651 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. అందులో 59 స్థానాలు ఎస్టీ కేటాయింపు కాగా జనరల్‌ కేటగిరీ ఒక్క స్థానానికే ఉంది. ఇక 12 జిల్లాలతో 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 21,61,129 ఓటర్లు ఉన్నారు అక్కడ. 55 స్థానాలు ఎస్టీ, జనరల్‌ కోటాలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎనిమిది జిల్లాలు, 60 స్థానాలు ఉన్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 28,13,478 మంది ఓటర్లు ఉన్నారు అక్కడ. ఇక్కడ 30 జనరల్‌, ఎస్సీ 10, ఎస్టీ 20 స్థానాలు ఉన్నాయి. మొత్తం 180 స్థానాలకు జరగబోయే ఎన్నికల కోసం 9,125 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. మార్చి 2వ తేదీన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.