Politics

రాహుల్​ గాంధీపై అనర్హత వేటు : 8ఏళ్లు ఎన్నికలకు దూరం!

రాహుల్​ గాంధీపై అనర్హత వేటు :  8ఏళ్లు ఎన్నికలకు దూరం!

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీపై అనర్హత వేటు పడింది. వయనాడ్​ లోక్​సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్​సభ సచివాలయం శుక్రవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మార్చి 23నే రాహుల్ గాంధీ ఎంపీ పదవికి అనర్హుడైనట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులు ఎవరికైనా రెండేళ్లకుపైగా శిక్ష పడితే వెంటనే పదవికి అనర్హులవుతారు. అలా అనర్హతకు గురైన వ్యక్తి రానున్న 8 సంవత్సరాల వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే వీలు లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం జైలు శిక్షకాలంతో పాటు మరో 6 సంవత్సరాల పాటు ఎన్నికల బరిలో దిగేందుకు అనర్హులు. మోడీ పరువు నష్టం కేసులో రాహుల్​కు గుజరాత్​లోని సూరత్​ న్యాయస్థానం రెండేళ్లు కారాగార శిక్ష విధించింది. ఆ శిక్ష కాలం పూర్తయ్యాక మరో 6 సంవత్సరాలకు ఎన్నికలకు రాహుల్ దూరంగా ఉండాల్సి ఉంటుంది.

మండిపడ్డ కాంగ్రెస్​ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆయన అనర్హత వేటుపై న్యాయపోరాటంతో పాటు రాజకీయంగాను పోరాడుతామని చెప్పింది. దీనిపై తాము భయపడేదిగానీ, మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేసింది. ప్రశ్నించే గొంతులను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నొక్కుతోందని జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై పార్లమెంటులో గళమెత్తే రాహుల్‌గాంధీని సభనుంచి వెళ్లగొట్టారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో ప్రతిపక్షాలను ప్రభుత్వం అణిచివేస్తే ప్రజల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. రాహుల్​ బలహీన వర్గాలకు వ్యతిరేకమనే ముద్ర వేయడం దారుణమని, లలిత్‌ మోదీ.. నీరవ్‌మోదీ.. వీరంతా బలహీనవర్గాల వారా అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ కోసం పట్టుబడుతున్నందుకే కక్షసాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్‌ వ్యాఖ్యల అంశం పరువునష్టం కలిగించేంత పెద్దది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. రాహుల్‌ అనర్హత వేటు అంశంపై ఎంతవరైనా పోరాడతామని స్పష్టం చేశారు. నిజాలు మాట్లాడే ప్రతి ఒక్కరిని సభ నుంచి గెంటేస్తున్నారని దుయ్యబట్టారు. సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమావేశం అవుతామని వెల్లడించారు. అదానీ మహామెగాస్కామ్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నియమించడానికి బదులు రాహుల్‌గాంధీపై అనర్హత వేటువేశారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. భారత ప్రజాస్వామ్యం ఓం శాంతి అని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. రాహుల్‌గాంధీపై ఇంత వేగంగా అనర్హత వేటు వేయడంపై సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.