Politics

తెలంగాణ పార్టీ నేతలు కార్యకర్తలతో పవన్ సమావేశం

తెలంగాణ పార్టీ నేతలు కార్యకర్తలతో పవన్ సమావేశం

తెలంగాణ ఎన్నికల్లో పోటీపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు జనసేన ప్రకటించింది. హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతల అభిప్రాయాలను పవన్‌కు వివరించినట్టు రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదని గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని పేర్కొంది. మిత్రపక్షమైన భాజపా విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సైతం దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుంటే క్యాడర్ బలహీనపడే అవకాశం ఉందని పవన్‌ దృష్టికి తెలంగాణ జనసేన తీసుకెళ్లింది.నేతల అభిప్రాయాలను విన్న పవన్ కల్యాణ్‌.. తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, నాయకులు, జన సైనికుల అభిప్రాయాలకు విలువ ఇస్తానని తెలిపారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని తెలిపారు. ఈ మేరకు జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణ శాఖ ఇన్‌ఛార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తాళ్లూరి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు రాజలింగం, ప్రధాన కార్యదర్శి ఎం.దామోదర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z