Health

కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై జగన్‌ సమీక్ష

కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై జగన్‌ సమీక్ష

కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో సమీక్షించారు. జేఎన్‌–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండానే ఈ కోవిడ్‌ వేరియంట్‌ సోకినవారు రికవరీ అవుతున్నారని అధికారులు తెలిపారు. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని అధికారులు తేల్చారు. అయితే జేఎన్‌–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని.. పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని చెప్పారు.

గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పెడుతున్నామని అధికారులు తెలిపారు. అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధంచేస్తున్నామన్నారు. పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. అలాగే ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, డి–టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధంచేశామని, 56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

సీఎం జగన్‌ ఏమన్నారంటే..
ఈ వేరియంట్‌ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారని సీఎం జగన్‌ తెలిపారు. ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్ధను ముందస్తు చర్యల కోసం అలర్ట్‌ చేయాలన్నారు. కొత్త వేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z