ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రూ.400 కోట్లతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
సంస్థ కొనుగోలు చేయాలనుకొనే వాటిలో 400 ఎక్స్ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరీ స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయని వివరించారు. వీటికి తోడు హైదరాబాద్ నగరంలో 540, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విడతల వారీగా 2024 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు సజ్జనార్ వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్లో భాగంగా రద్దీ పెరగడంతో కొత్త బస్సులను వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.
‘‘అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి వినియోగంలోకి వస్తాయి. వాటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరీ స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి. ఈ కొత్త బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తాం. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు’’ అని సజ్జనార్ తెలిపారు
👉 – Please join our whatsapp channel here –