Politics

మోడీ మద్దతు లేకుండా అదానీ వ్యాపారమే లేదు

మోడీ మద్దతు లేకుండా అదానీ వ్యాపారమే లేదు

సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ

హైదరాబాద్ : రైల్వేస్టేషన్లు, రైళ్లు ,పోర్టులను ప్రజా సొమ్ముతో అభివృద్ధి చేసిన తర్వాత, వాటిని తిరిగి కార్పొరేట్ శక్తులకు అమ్మెందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. ‘బిజెపి హటావో – దేశ్ బచావో ’ నినాదంతో ప్రజా క్షేత్రంలోనికి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అప్రజస్వామిక విధానాలను ప్రజలకు తెలియజేస్తామని వెల్లడించారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల 14 నుండి మే 15 వరకు నిర్వహించే “బిజెపి హటావో – దేశ్ బచావో” పాదయాత్ర కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి.నర్సింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి. చంద్ర మోహన్ గౌడ్, పడాల నళిని, నిర్లేకంటి శ్రీకాంత్, ఆర్. మల్లేష్ లతో కలిసి హైదరాబాద్, హిమాయత్ నగర్, మగ్ధుంభవన్ లో నారాయణ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ లాభాలను చూపించి, ప్రైవేటుపరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైలును తీసుకొచ్చిందని విమర్శించారు. ఒక వైపు ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేసి, మరోవైపు ప్రజా సొమ్ముతో వంద ఎయిర్ పోర్ట్ లను ఎవరికి కోసం నిర్మిస్తున్నారని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎయిర్ పోర్ట్ లను కూడా కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.15 లక్షల కోట్ల ఆస్తలు కలిగిన బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థకు కేవలం రూ.35 కోట్ల అప్పును కూడ కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు. ప్రధాని పదవికి చదువుకు సంబంధం లేకపోయినా చదువుకున్న డిగ్రీ అంశంలో కూడా మోడీ అబద్దాలు చెబుతూ అనైతికతకంగా వ్యవహారిస్తూ ప్రధాని స్థాయిని దిగజార్చుకున్నారని మండిపడ్డారు. అదానీ బంగార చిలుక అని, కూపీలాగితే మోడీ, అమిత్ షా లు బయటకు వస్తారని, అందుకే అదానీని ప్రధాని మోడీ రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మోడీ మద్దతు లేకుండా అదానీ వ్యాపారమే లేదన్నారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ప్రధాని మోడీ అవినీతి గురించి మాట్లాడుతున్నారని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. దేశాన్ని సర్వనాశనం చేసే మోడీ లాంటి విపత్కర మైన ప్రధానిని తాము ఎప్పడూ చూడలేదన్నారు.తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత వరకు నిధుల సహాయం చేసింది?, రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ఎంత వరకు తీసుకున్నారో స్పష్టం చేయాలని, దీనిపై తాను ఎక్కడైనా, మీడియా సమక్షంలోనైనా చర్చకు సిద్ధమేనని బిజెపి నేతలకు కూనంనేని సవాల్ విసిరారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.45వేల కోట్లు రావాల్సి ఉన్నదని, ఆర్థిక సంఘం సూచించినా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ద్వజమెత్తారు. చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, ఐఐఐటి రాలేదన్నారు. జాతీయ రహదారులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తాయని, కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదన్నారు. పేపర్ లికేజీలో అరెస్ట్ అయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాంటి దొంగల ముఠాకు మోడీ నాయకునిగా వ్యవహారిస్తూ “నేను ఉన్నా గో హెడ్’ అని మోడీ అంటున్నారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకునేందుకు సిపిఐ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు మోడీ ప్రభుత్వ ప్రయత్నించడం అన్యాయమని ద్వజమెత్తారు. ఈ నెల 14 నుంచి మే 15 వరకు “బిజెపి హటావో – దేశ్ బచావో ”నినాదంతో ప్రజల వద్దకు సిపిఐ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల వద్దకు సిపిఐ కార్యక్రమాన్ని హైదరాబాద్, ట్యాంక్ బండ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ యాత్ర రాష్ట్ర వ్యాపితంగా సాగుతుందని, అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియజకవర్గాల్లో పాదయాత్రగా ప్రజలకు వద్దకు వెళ్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అవినీతిని, ప్రజా వ్యతిరేక విధానాలను, తెలంగాణ రాష్ట్రం పట్ల నిర్లక్షాయన్ని ప్రజలకు వివరిస్తామని, క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. ఈ యాత్రలో వేలాది మంది సిపిఐ శ్రేణులు ఎక్కడికక్కడ పాల్గొంటారని తెలిపారు. ఈ.టి.నర్సింహ మాట్లాడుతూ ‘వందేభారత్ రైలు’ భాగ్యలక్ష్మినగర్ నుంచి వెంటేశ్వర నగర్ వరకు వెళ్తుందని మోడీ ప్రకటించారని, కానీ భాగ్యలక్ష్మి ఆలయం సమీపంలో కూడా రైల్వే స్టేషన్ లేదని, రైలును కూడా మతోన్మాదానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బిజెపి, ఎంఐఎం మతోన్మాద పార్టీ వ్యవహార శైలి పట్ల ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. 2014 సంవత్సరానికి ముందు ఎంఐఎం కేవలం హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమని, అలాంటి పార్టీ బిజెపికి బి టీమ్ విస్తరిస్తుందని విమర్శించారు. నెల రోజుల పాటు జరిగే తమ పాదయాత్రలో మతోన్మాద బిజెపి, ఎంఐఎం పార్టీల వైఖరిని, వ్యవహార శైలిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

‘విశాఖ స్టీల్’ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకురావడం అభినందనీయం : నారాయణ
విశాఖ స్టీల్ ప్రభుత్వ రంగ సంస్థను తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలిపారు. బొగ్గు, స్టీల్ లింకు ఉన్నదన, సింగరేణి సంస్థ ద్వారా నడిపంచవచ్చని కెసిఆర్ ముందుకురావడాన్ని ప్రత్యేకంగా అభినంధించారు. ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థను కాపాడినట్టేనని, ఇలాంటి ప్రయత్నాన్ని తాము స్వాగతిస్తూనే సంస్థ అభివృద్ధికి, తాము, కార్మిక వర్గం కృషి చేస్తామని హమీనిచ్చారు. బంగారుబాతును అదానీ తన్నుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లొంగిపోయినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుక ముందుకు రావడం జాతి సంపదకు, ఆపదలో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ సంస్థను కొనుగోలు చేయాలని, అ ందుకు తాము పూర్తి గా మద్దతునిస్తామని నారాయణ అన్నారు. రూ.3 లక్షల కోట్ల విలువు చేసే విశాఖ ఉక్కు సంస్థను కేవలం రూ. 30 వేల కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం జరిగడం అన్యాయమన్నారు.