NRI-NRT

మలేషియా వెళ్లాలనుకునే వారికి శుభవార్త

మలేషియా వెళ్లాలనుకునే వారికి శుభవార్త

పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం (Malaysia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం (Anwar Ibrahim) ఆదివారం జరిగిన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో వెల్లడించారు.

మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ముఖ్యం అని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం తెలిపారు. ఇందులో భాగంగానే చైనా, భారత్‌ పౌరులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి చైనా, భారతీయ పౌరులు వీసా లేకుండా మలేషియాలో పర్యటించే వీలుంటుందని స్పష్టంచేశారు. తమ దేశంలోకి ప్రవేశించాక 30 రోజుల పాటు ఉండొచ్చని తెలిపారు. భారత్‌, చైనా నుంచి వచ్చే పర్యాటకులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు వీసా సౌకర్యాలను మెరుగుపరుస్తామని గత నెలలోనే ప్రకటించిన అన్వర్‌ తాజాగా అందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఇదిలాఉంటే, భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్‌, శ్రీలంక ప్రభుత్వాలు కూడా కల్పించాయి. నవంబర్‌ 10 నుంచి థాయిలాండ్‌ దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. వచ్చే ఏడాది మే 10వరకు ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే, డిమాండు పెరిగితే దాన్ని తదుపరి కొనసాగించే అవకాశం ఉంటుందని థాయిలాండ్‌ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అక్టోబర్‌ నెలలోనే శ్రీలంక అనుమతినిచ్చింది. భారత్‌ సహా ఏడు దేశాల పర్యాటకులకు ఈ వెసులుబాటు కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31వరకు ఇది అందుబాటులో ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z