Politics

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత – TNI రాజకీయ వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత  – TNI  రాజకీయ వార్తలు

* తాము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, అదే జనసేన లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. విజయవాడలో జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జనవాణి ఉద్దేశాలను వెల్లడించారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యల సాధనకు చర్యలు తీసుకుంటేనే ప్రజా ప్రతినిధులకు గౌరవం ఉంటుందన్నారు.అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఎదురు చూడడం లేదని అన్నారు. నేటి పాలకులకు ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆవేదన నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయన్నారు. పార్టీ నేతల వద్దకు ప్రజలు రాకుండా ప్రజల వద్దకే పాలకులు వెళ్లాలనే సదుద్దేశంతో జనవాణిని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

*ఎందుకు వణికిపోతుందో నాకే అర్థం కావడం లేదు: రఘురామ
రేపు అల్లూరి జయంతి వేడుకలకు హాజరవుతానని ఎంపీ రఘురామ రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీ ప్రభుత్వం నేనంటే ఎందుకు వణికిపోతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే నాకు వీవీఐపీ పాస్ ఇవ్వాలి.. కానీ ఇవ్వలేదన్నారు. ఎవరు చెప్పారని వీవీఐపీ పాస్ ఇవ్వట్లేదు? అని ఆయన ప్రశ్నించారు. ఎస్పీజీ రవిప్రకాష్ తన నెంబర్ బ్లాక్ చేశారని మండిపడ్డారు. ధైర్యముంటే నన్ను ఆపుకోండి.. చూద్దామని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఓ వింత వ్యాధితో బాధపడుతోందని రఘురామకృష్ణరాజు విమర్శించారు. నాకెలాంటి అవమానం జరిగినా.. అది ప్రధానికి జరిగినట్టేనన్నారు. అవమాన పరిణామాలు జులై 18 తర్వాత తీవ్రంగా ఉంటాయాన్నారు. తన ఫ్లెక్సీలను కట్టినవాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను చూస్తే జాలేస్తోందని, పులి కడుపున పిల్లి పుట్టిందన్నారు.

*వారిని అక్రమంగా అదుపులోకి తీసుకుని CID వేధించింది: Chandrababu
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ వేధింపులపై ఆయన ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను.. సీఐడీ అధికారులు అక్రమంగా అదుపులోకి తీసుకుని వేధించారని మండిపడ్డారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడ్డారన్నారు. ఇంట్లోకి చొరబడి వాళ్ల కుటుంబీకులను భయబ్రాంతులకు గురిచేశారని, స్టేషన్‍లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి దాడికి పాల్పడడం దారుణమన్నారు. విచారణ సమయంలో గదిలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఐడీ అధికారులు వ్యవహరించారన్నారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేస్తోందన్నారు. టీడీపీ శ్రేణులపై బెదిరింపు చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ శ్రేణులను అక్రమంగా అదుపులోకి తీసుకుని.. చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం సీఐడీకి ఏముందని? ప్రశ్నించారు. కుట్రలకు పాల్పడిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు డీజీపీ అండగా నిలబడాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

*దివ్యాంగులను ఆదుకోవాలి: Pawan Kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి దివ్యాంగులు వచ్చారు. వారి వినతులను పవన్ స్వీకరించారు. నేలపై కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల ఇబ్బందులు వర్ణించలేనివన్నారు. కొందరు కండరాల క్షీణతతో వీల్ చైర్‌కే పరిమితం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అమరావతిలో రీహాబిలిటేషన్‌ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి జిల్లాలో కేంద్రాలు పెట్టి..‌ జీవనోపాధి మార్గాలను చూపాలన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద దివ్యాంగులకు ఆర్థిక సాయం చేయాలని, కేంద్రం ఆమోదించిన ప్రకారం రూ. 15వేలు పింఛన్ ఇవ్వాలని కోరారు.

*తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం:Koppula
రాష్ట్రంలోని గురుకులాలు దేశానికే ఆదర్శమని,ఇవి ముందుకు సాగుతున్న తీరు, సాధిస్తున్న విజయాలు, ఫలితాలు మనందరికి గర్వ కారణమని ఎస్సీవెల్ఫేర్ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.కెజి నుంచి పిజి వరకు అన్ని వర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని పెద్ద సంఖ్యలో నెలకొల్పారని తెలిపారు.తెలంగాణలో కొనసాగుతున్న విధంగా గురుకులాలు దేశంలో మరెక్కడా కూడా లేవని,5 సొసైటీల ఆధ్వర్యంలో 990 స్కూళ్లు గొప్పగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.వీటిలో తమ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని,సీట్ల కోసం ప్రతి నిత్యం వందలాది మంది తమ వద్దకు వస్తుంటారని మంత్రి తెలిపారు.

*ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నా: జగ్గారెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావునుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి స్పందించారు.హైదరాబాద్‌కు వచ్చిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను వీహెచ్ హనుమంతరావు ఇటీవల కలిశారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంటికి వచ్చినపుడు కలవాలి కాని, కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి కలవడమేంటని వీహెచ్‌ను పరోక్షంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు.

*తెలంగాణలో Congressలోకి వలసలు పెరిగాయి: Mallu Ravi
తెలంగాణ లో కాంగ్రెస్‌ లోకి వలసలు పెరిగాయని పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. కార్యకర్తలలో భరోసా.. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని పార్టీ సీనియర్ నేతల రాహుల్ స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. పొత్తుల విషయం మాట్లాడవద్దని రాహుల్ ఆదేశాలు జారీ చేశారన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్ సూచించారన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి( వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమని మల్లు రవి పేర్కొన్నారు. పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాల్సిందన్నారు. పార్టీ అధ్యక్షులపై ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడటం వల్ల మన శత్రువులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నారు. ఇది క్యాడర్ మనోస్త్యైర్యాన్ని దెబ్బదీసి పార్టీకి తీరని నష్టం చేస్తుందని మల్లు రవి పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే అధిష్టానం స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు పార్టీకి రెండు కళ్ళలాగా పని చేస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మల్లు రవి పేర్కొన్నారు.

*ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నా: జగ్గారెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావునుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి స్పందించారు. హైదరాబాద్‌కు వచ్చిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను వీహెచ్ హనుమంతరావు ఇటీవల కలిశారు. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంటికి వచ్చినపుడు కలవాలి కాని, కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం వెళ్లి కలవడమేంటని వీహెచ్‌ను పరోక్షంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు.

*సుందర పర్యాటక కేంద్రంగా బన్సీలాల్ పేట మెట్ల బావి:Talasani
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో వున్న బన్సీలాల్ పేట లోని పురాతన మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్ధానిక ఎమ్మెల్యే, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తె లిపారు. గత కొన్ని సంవత్సరాలుగా చెత్తాచెదారంతో పూడుకు పోయిన ఈ బావిని కొంతకాలంగా పూడిక తీసే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రితలసాని మాట్లాడుతూ అమృత్సర్ లోని గురుద్వార మెట్ల బావి మాదిరిగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చి దిద్దుతామని చెప్పారు.

*జూలై 3న భీమవరానికి ప్రధాని మోదీ: విష్ణువర్ధన్ రెడ్డి
ప్రధాని మోదీ జూలై 3వ తేదీ భీమవరంలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పర్యటన పూర్తి వివరాలను ఆయన వివరించారు. ‘‘ ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 10.10గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో భీమవరానికి 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాక బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు భారీగా బీజేపీ శ్రేణులు హాజరుకావాలని పిలుపునిచ్చాం. రాజకీయాలకు అతీతంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. కవులు, కళాకారులు, గాయనీ గాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపాం.’’ అని పేర్కొన్నారు.

*ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నా కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని కాదు: కేటీఆర్‌
కల్వకుర్తి కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎ్‌సలో చేరిన సందర్భంగా గురువారం తెలంగాణ భవన్‌లో తాను మాట్లాడిన మాట వల్ల ఎవరికైనా బాధ కలిగితే.. దానిని వెనక్కి తీసుకుంటున్నానని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ శనివారం పేర్కొన్నారు. తాను విశ్వబ్రాహ్మణుల(చారీ)ను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని.. ఒక కులాన్ని, వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే కుసంస్కారిని కాదని వివరించారు. కల్వకుర్తి బీజేపీ నేతను ఉద్దేశించి గురువారం కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి తమ కులాన్ని కించపరిచారని విశ్వబ్రాహ్మణులు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఒక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు

*మోదీకి ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు:సీపీఎం
విభజన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టే అర్హత ప్రధాని నరేంద్రమోదీకి లేదని, కాదని వస్తే అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకుడు సీహెచ్‌.నరసింగరావు హెచ్చరించారు. శనివారం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట పీహెచ్‌సీ నుంచి అల్లూరి పార్కు వరకు ర్యాలీ నిర్వహించి అల్లూరి, గంటందొరల సమాధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి అటకెక్కించారని చెప్పారు. పోలవరానికి నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలో నిలిచిపోయిందన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దారుణమని, దీనికి మోదీ సమాధానం చెప్పాలన్నారు. కాగా, జూన్‌ 28 నుంచి జూలై 4 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు జరపాలని వామపక్షాలు నిర్ణయించాయని శ్రీనివాసరావు చెప్పారు. అందులో భాగంగానే పాండ్రంగి, కృష్ణాదేవిపేటలను సందర్శించామన్నారు. పాండ్రంగి గ్రామాన్ని 2015లో అప్పటి కేంద్ర మంత్రి సురేశ్‌ప్రభు దత్తత తీసుకుని..కనీసం నది వద్ద వంతెన కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు.కృష్ణాదేవిపేట అల్లూరి పార్కులో రంగులు కూడా వేయలేదన్నారు.

*వాళ్లను శిక్షించాల్సిందే: Lokesh
పుంగనూరు మండలం కల్లూరుకు చెందిన టీడీపీ నేత శివకుమార్‌ పై వైసీపీ కార్యకర్తల దాడిని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేశ్ ఖండించారు. మరో టీడీపీ నేత రాజారెడ్డి ని వైసీపీ కార్యకర్తలు హత్య చేయడానికి యత్నించారని ఆయన ఆరోపించారు. వైసీపీ వాళ్లు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. నాడు రాజారెడ్డి, నేడు శివకుమార్ ..రేపు ఇంకెవరు అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ప్రతి చర్యకు దిగితే పరిణామాలకు బాధ్యత పోలీసులది కాదా? అని నిలదీశారు. తక్షణమే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

*టీఆర్‌ఎస్‌, బీజేపీ చిల్లర రాజకీయాలు: రేవంత్ రెడ్డి
ప్రజా సమస్యలను గాలికొదిలి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చిల్లర రాజకీయాలుచేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.కల్లు కంపౌండ్‌లో కల్తీ కల్లు తాగినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బిజెపి, టీఆర్ఎస్ పార్టీలపై తీవ్రంగా స్పందించారు.కార్పొరేట్ కంపెనీల డబ్బులతో బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటోందన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వలేదని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై కేంద్రాన్ని కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. కేంద్రం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలుగా అటువైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదన్నారు. జీఎస్టీ ద్వారా జరిగిన అన్యాయంపై కేసీఆర్‌ ప్రశ్నించలేదని అన్నారు.సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీలతో రెండు పార్టీలు చిల్లర తగాదాలు చేస్తున్నారని ఆరోపించారు.అగ్నిపథ్ పథకంపై మోదీని కేసీఆర్‌ ప్రశ్నించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ విగ్రహానికి కూడా టీఆర్ఎస్ జెండాలు కట్టారు.ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం దేనికి సంకేతమని రేవంత్‌ ప్రశ్నించారు.ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోకపోతే కేసీఆర్, కేటీఆర్‌ల వీపులకు కాంగ్రెస్ జెండాలు కడతామని రేవంత్‌ హెచ్చరించారు.

* ఒక వ్యక్తి చెబుతుంటే 1౩5 కోట్ల మంది వినాలా..?:యశ్వంత్ సిన్హా
దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవివరంగా చెప్పారని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు.తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో యశ్వంత్‌ సిన్హా మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెరాస సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెరాస ప్రతినిధులు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.”చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదు. ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం అంతకన్నా కాదు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..? ఇదేనా ప్రజాస్వామ్యం. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాటం కొనసాగుతుంది. దేశానికి కేసీఆర్‌ వంటి నేత అవసరం. ఇప్పుడు చేసే పోరాటం భారత్‌ భవిష్యత్తు కోసం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసేది. కేసీఆర్‌తో మరోసారి సమావేశమవుతా” అని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.