Politics

బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్‌

బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్‌

తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నికల హామీలను మీడియాకు ప్రకటించారు. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్‌.. అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని వెల్లడించారు. అన్ని వర్గాల పరిగణనలోకి తీసుకున్నామన్న కేసీఆర్‌.. తొలి నుంచి తమ ప్రభుత్వ విధానం ఆదాయాన్ని పెంచడం.. దాన్ని పేదలకు పంచడమనే విధానంతోనే వ్యవహరిస్తున్నామని చెప్పారు. గతంలో అనేక కార్యక్రమాలు చేప్టటామని.. ఈసారి కూడా అలాగే చేస్తామని వెల్లడించారు. గత ఎన్నికల ప్రణాళికలో చెప్పని అంశాలను సైతం అమలు చేసిన ఘనత తమదేనన్నారు.

సీఎం కేసీఆర్‌ ప్రకటించిన కీలక హామీలివే..

* రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ రైతు బీమా తరహాలో కేసీఆర్‌ బీమా. రాష్ట్రంలో 93లక్షల కుటుంబాలకు ‘కేసీఆర్‌ బీమా-ఇంటింటికీ ధీమా’ పథకంతో ₹5లక్షల బీమాకు ఎల్‌ఐసీ ద్వారా ప్రీమియం చెల్లిస్తాం.
ఆసరా పింఛన్లు మొత్తాన్ని రూ.5వేలకు పెంపు. తొలి ఏడాది రూ1000, ఆ తర్వాత ఏటా రూ.500ల చొప్పున రూ.5వేలకు పెంచుతాం.

* దివ్యాంగులకు పింఛను రూ.6వేలకు పెంపు. దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5వేలకు పెంపు. ఏటా రూ.300ల చొప్పున పెంచుతాం.

* సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి చెల్లిస్తాం
అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా

* రైతు బంధు మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంచుతాం. తొలి ఏడాది రూ.12వేల వరకు పెంపు.

* పవర్‌ పాలసీ, అగ్రికల్చర్‌ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తాం. ఇంకా అవసరమైన ఉద్దీపనలు ఏయే రంగాల్లో అవసరమో వాటిని కూడా చేసుకుంటూ ముందుకు సాగుతాం.

* ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఎన్నికవుందని బలంగా విశ్వసిస్తున్నాం. మేం ఇచ్చే హామీలను మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆరు, ఏడు నెలల్లో అమలు చేస్తాం.

* తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం. ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్న బియ్యం అందజేస్తాం.

* భవిష్యత్‌లోనూ గిరిజనులకు మరిన్ని పథకాలు.

* దళిత బంధు, రైతు బీమా కొనసాగింపు.

* గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు. గిరిజనుల కోసం ప్రకటించని హామీలను భారాస ప్రభుత్వం అమలు చేసింది. భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తాం.

* లంబాడీ తండాలు, గోండు గూడేలను పంచాయతీలను చేస్తాం.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z